Skip to content

తలసేమియా రన్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు: నారా భువనేశ్వరి

  • MOVIES
  • Vishwanath
తలసేమియా రన్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు: నారా భువనేశ్వరి Telugu News
తలసేమియా రన్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు: నారా భువనేశ్వరి Telugu News

ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌రోడ్డులో తలసేమియాపై అవగాహన కోసం రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ మ్యానేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి ప్రారభించారు. ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, హోం మంత్రి అనిత, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ కే రాజేంద్రకుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని ఈ రన్ ని విజయవంతం చేశారు. అనంతరం రన్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారులని సత్కరించారు. అనంతరం గ్రాండ్ మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ మ్యానేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. తలసేమియా రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి గారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. తలసేమియా గురించి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ రన్ అని వారికి చెప్పినప్పుడు వెంటనే కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రస్టు మీటింగ్ కి వెళ్ళేటప్పుడు అక్కడ చాలామంది అమ్మలు చిన్నపిల్లల్ని పట్టుకుని ఎదురుచూసేవారు. ఎందుకు ఇక్కడ ఉన్నారని అడిగినప్పుడు మాకు బ్లడ్ అవసరం మీరేమైనా సమకూర్చగలరా, తల సేమియాకు సంబంధించి మందులు ఇవ్వగలరా అని కోరారు. ఆ చిన్న పిల్లల్ని చూసినప్పటి నుంచి తలసేమియా గురించి ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో మొదటి భాగంగా విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహించాము. తమన్ గారిని వెళ్లి కలిసినప్పుడు తలసేమియా పిల్లల కోసం నేను ఏమీ తీసుకోకుండా ఉచితంగా మీ ట్రస్ట్ కి వర్క్ చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తమన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి దాతలు మా ట్రస్ట్ ను నమ్మి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మానవసేవే మాధవ సేవ అని నమ్ముతోంది. మేము ఎన్నో సేవా కార్యక్రమాల్ని ప్రజల కోసం చేస్తున్నాం. మా ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందికి పైగా అవసరమైన వారికి రక్తాన్ని అందించడం జరిగింది. 15 వేలకు పైగా ఆరోగ్య శిబిరాలు, సంజీవిని ఫ్రీ క్లినిక్ ద్వారా లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆర్థికంగా వెనకబడిన వేలాదిమంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నాం. మహిళల కోసం స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం. తలసెమియా కోసం నిర్వహించిన మ్యూజిక్ నైట్లో తమన్ గారు డొనేట్ చేసిన విరాళం నుంచి కొంత తీసి 25 బెడ్స్ ఉన్న కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. చిన్నారులకు వైద్యం అందిస్తున్నాము. కేవలం రక్తమే కాదు మందులకు కూడా ప్రతి చిన్నారి మీద నాలుగు నుంచి ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా అందిస్తున్నాం. కష్టాల్లో ఉన్న మనిషికి అండగా నిలవడం కూడా ఒక గొప్ప దానం. భరోసా బాధపడే మనిషికి చాలా తృప్తిని ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రన్ లో మీరు వేసిన ప్రతి అడుగు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి భరోసా ఇచ్చినట్లయింది. ఈ రన్ లో పాల్గొని మీరందరూ బాధితులకు అండగా ఉన్నామని చాటి చెప్పడం ఆనందంగా ఉంది. సేవా కార్యక్రమాల్లో అందరం కూడా భాగం అవ్వాలి, ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారంటే అదే మాకు కొండంత బలం. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. మేము ఇంకా ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. దాతలకి, మీడియాకి, పోలీసు వారికి, గవర్నమెంట్ అధికారులకి, ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. జైహింద్’అన్నారు.

ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. భువనేశ్వరి గారు చాలా గొప్పగా ఆలోచిస్తారు. సమాజం పట్ల వారి ఆలోచనలు నన్ను ఎంతగానో మెస్మరైజ్ చేస్తాయి. ఇలాంటి పనులు చేయడానికి గొప్ప మనసు కావాలి. నమ్మకం కావాలి. ఈ కార్యక్రమంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. మేడం భువనేశ్వరి గారితో కలిసి పనిచేయడం ఎంత ఆనందంగా వుంది’అన్నారు

కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ.. గౌరవనీయులైన భువనేశ్వరి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, పెద్దలందరికీ, ప్రజలందరికీ నమస్కారం. ఈ వ్యాధి గురించి అవేర్నెస్ ని రన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ లో సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తలసేమియాపై అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల బాధితులకు ప్రయోజనం జరగాలని నేను కోరుకుంటున్నాను. దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను’అన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ కే రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. హలో వైజాగ్. ఫస్ట్ విమెన్ ఒలంపిక్ మెడల్ విన్నర్ కరణం మల్లేశ్వరి గారు ముఖ్యఅతిథిగా రావడం ఆనందంగా ఉంది. నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. తలసేమియా అవేర్నెస్ కోసం తల సేమియా మూమెంట్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాతో భాగమైన తమన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తలసేమియా బాధితులకు అండగా నిలబడదాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలియజేశారు.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.