Skip to content

“శివోహం” పాటలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా – తనికెళ్ల భరణి

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడిని పూజిస్తూ రూపొందిన “శివోహం” పాట ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ పాటను రాధాకేశవ్ సమర్పణలో పొత్తపు కేశవరెడ్డి నిర్మించారు. దామురెడ్డి దర్శకత్వం వహించారు. యశోకృష్ణ సంగీతాన్ని అందించిన శివోహం పాటను ప్రసిద్ధ మలయాళ గాయకుడు మధు బాలకృష్ణన్ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కీర్తన టీవీలో అందుబాటులో ఉండనుంది. శివోహం పాట ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, నటుడు గౌతమ్ రాజు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

సంగీత దర్శకుడు యశోకృష్ణ మాట్లాడుతూ – మహాశివరాత్రి సందర్భంగా శివోహం పాటను విడుదల చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ పాటకు సంగీతాన్ని అందించే అదృష్టం నాకు దక్కింది. ఈ పాటకు సంగీతం చేసే అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్నారు.

దర్శకుడు దామురెడ్డి మాట్లాడుతూ – శివోహం పాటను మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం. హిందీతో పాటు అన్ని ప్రధాన దక్షిణాది భాషల్లో రూపొందించాం. ఈ క్రమంలో నిర్మాత కేశవరెడ్డి గారు, నటులు తనికెళ్ల భరణి గారు ఎంతో సహకరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని మరింత భక్తి పారవశ్యంతో జరుపుకునేలా మా శివోహం పాట ఉంటుంది. అన్నారు.

నిర్మాత పొత్తపు కేశవరెడ్డి మాట్లాడుతూ – శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు సమక్షంలో మా శివోహం పాటను ఆవిష్కరించుకోవడం, ఈ కార్యక్రమానికి తనికెళ్ల భరణి గారు, సుద్దాల అశోక్ తేజ గారు అతిథులుగా రావడం సంతోషంగా ఉంది. భక్తి భావంతో పాటు ఒక గొప్ప సందేశాన్ని భక్తులకు ఇచ్చేలా శివోహంను నిర్మించాం. అన్నారు.

ప్రముఖ నటులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ – నేను పాతికేళ్ల క్రితం ఆటగదరా శివ అనే పుస్తకం రాశాను. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మహాశివుడి గురించి కార్యక్రమం జరిగినా నన్ను అతిథిగా పిలుస్తున్నారు. శివోహం పాటలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. శివ భక్తితో లీనమై ఈ పాటలో నటించాను. ఈ పాటను ఈషా ఫౌండేషన్ ప్రాంగణంలో చిత్రీకరించే అవకాశం కలిగింది. ఈషా శైలజతో మాట్లాడి నేనే పర్మిషన్ ఇప్పించాను. ఈ పాటను వీలైనంత అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు దామురెడ్డి. యశోకృష్ణ బాగా కంపోజ్ చేశారు. సామాన్య పదాలతో అద్భుతమైన పాట రాశారు సుద్దాల అశోక్ తేజ. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేలా పాడారు మధు బాలకృష్ణన్. శివోహం పాట భక్తులందరినీ అలరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ – నాతో తొలి పాట రాయించిన వారు తనికెళ్ల భరణి. ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను ఇండస్ట్రీకి రాకపోయేవాడిని. ఆయన సమక్షంలో, శంకరభారతి స్వామివారి సమక్షంలో శివోహం పాట ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది. ఈపాటను ఇంత మంది పెద్దల సమక్షంలో ఆవిష్కరించుకుంటాం అని నేను ఊహించలేదు. బ్రహ్మ కనిపించే తీరు వేరు, శ్రీవిష్ణువు కనిపించే తీరువేరు అయితే శివుడు కనిపించే తీరు నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. శివ రాజధాని కైలాసంలో అందరూ సమానమే. సమసమాజం ఉన్న చోటు అది. అక్కడ పాము ఉంటుంది, ఎలుకా ఉంటుంది. అయితే అవి గొడవలు పడవు. కలిసే ఉంటాయి. ఇలాంటి సమసమాజం మరే దేవుడి రాజధానిలోనూ ఉండవు. అర్థనారీశ్వరుడిలా మనకు శివుడు ఎందుకు దర్శనమిస్తాడంటే భార్య భర్త ఎలా కలిసి ఉండాలో చెప్పేందుకు. ఇలాంటి గొప్ప సందేశం శివుడు మనకు అందిస్తాడు. ఈ పాట నేను రాసిన తర్వాత యశోకృష్ణ స్వరపర్చాడు. ఇలాంటి ఒక మంచి భక్తి గీతాన్ని మీరంతా విని ఆనందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు మాట్లాడుతూ – శివోహం పాట మీ చేతుల మీదుగా జరగాలని తనికెళ్ల భరణి గారు నాకు ఫోన్ చేశారు. సోమవారం మా పీఠంలో అనేక అర్చన కార్యక్రమాలు ఉంటాయి. ఈ పాట కూడా శివుడి కోసమే రూపకల్పన చేసింది కాబట్టి నా దృష్టిలో రెండూ సమానమే అనుకున్నాం. అందరూ సమానమే అనే అద్వైత భావన కైలాసంలో ఉంటుంది. ప్రమదగణాలన్నీ శివుడిని పూజిస్తుంటాయి. శివోహం పేరుతో మహాశివరాత్రికి ఈ పాటను విడుదల చేయడం మనందరి అదృష్టం. అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.