Skip to content

కళ… మనుషుల్ని కలపాలనే విశాల దృక్పథంతో ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు

కళ… మనుషుల్ని కలపాలనే విశాల దృక్పథంతో ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు Telugu News

తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అభ్యంతరాలు

కళ అనేది మనసుల్ని హత్తుకొని మనుషుల్ని కలిపేది… అంతేగానీ భాష, ప్రాంతాల పేరుతో విడదీసి మనుషుల్ని దూరం చేసేది కాదు. సినిమా అనేది భిన్న కళల సమాహారం. అందుకే పర భాషా చిత్రం అనే పేరుతో మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదనే విశాల దృక్పథాన్ని ‘కాంతారా ఛాప్టర్ – 1’ విషయంలో కనపరిచింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారని, ఈ తరుణంలో అక్కడి చిత్రాలకు ఇక్కడ టికెట్ ధరలు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అభ్యంతరాలు వచ్చాయి. అక్కడి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇబ్బందిపెట్టడం భావ్యం కాదు… పెద్ద మనసుతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు సినిమాటోగ్రఫీ, హోమ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు నిర్ణయం జరిగింది.
• కర్ణాటకలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి: తెలుగు సినీ వర్గాలు
ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తెలుగు సినిమాను కర్ణాటక రాష్ట్రంలో విడుదల సందర్భంలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయని, మన చిత్రాలకు టికెట్ ధరల పెంపు విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంలేదని పేర్కొన్నారు. అదే విధంగా తెలుగు సినిమా ఉద్దేశంతో సినిమా పోస్టర్లు, బ్యానర్లు కూడా తొలగించే చర్యలకు కొందరు దిగుతున్నా కన్నడ సినీ పరిశ్రమ నుంచి స్పందన రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమా విషయంలో కూడా అక్కడ తరతమ బేధాలు చూపిన విషయాన్ని ప్రస్తావిస్తూ గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు, తాజాగా ‘ఓ.జి.’ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. అక్కడ తెలుగు సినిమాకు టికెట్ ధరల విషయంలో హైకోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. ‘కాంతారా ఛాప్టర్ – 1’ తోపాటు కన్నడ చిత్రాలకు టికెట్ ధర పెంపుపై ముందుకు వెళ్ళే విషయంలో పునరాలోచన చేయాలని కోరారు.
• మంచి మనసుతో… జాతీయ భావనలతో ఆలోచన చేయాలి
ఈ విషయం గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కల్యాణ్ గారితో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, సంబంధిత శాఖ అధికారులు చర్చించారు. ఈ అంశంపై శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పందిస్తూ “కర్నాటకలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి చిత్రాలకు ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వడం ఆపవద్దు. కళ అనేది మనసుల్ని కలపాలి… విడదీయకూడదు అనేది వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుందాము. మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్ గారి కాలం నుంచి ఇప్పటి కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదరభావంతో ఉన్నాము. మన సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు ప్రభుత్వపరంగా మనమూ మాట్లాడదాము. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాను. కర్ణాటకలో ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంతారా ఛాప్టర్ 1 కి ఆటంకాలు కల్పించవద్దు” అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.