Skip to content

‘ఉస్తాద్ భగత్ సింగ్’కు అంచనాలకంటే భారీ రెస్పాన్స్: సక్సెస్ మీట్

ప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా.. భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా నేడు( మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా మెచ్చేలా సినిమాని మలిచారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఇలా అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడం కాకుండా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ముందుగా మీడియా మిత్రులకు కృతఙ్ఞతలు. ఇదొక మాస్ ఎంటర్టైనర్ కాబట్టి, ఓవర్సీస్ నుంచి పాజిటివ్ టాక్ రావడానికి కొంచెం సమయం పడుతుంది అనుకున్నాను. కానీ, మొదటి షో నుంచే అన్ని ప్రాంతాలలో పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాని మలిచాము. సినిమా చూసిన వారిలో చాలామంది.. సినిమాలో ఇంత కంటెంట్ ఉందని మాకు ముందు తెలియదు అంటూ ఆశ్చర్యపోతున్నారు. నేను మొదటి రోజు నుంచి ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తున్నాను, వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూపించబోతున్నానని చెప్పాను. కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో కొన్ని మంచి అంశాలు చూపించాము. ముఖ్యంగా మన తెలుగు సినిమాలో ఇంతవరకు చూపించని అక్రమ వలసదారులు అంశం గురించి సినిమాలో చర్చించాము. సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. పాత్రలు బాగా పండాయి. ప్రతి పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫోన్ చేసి అన్నా సినిమా చాలా చాలా బాగుంది అంటున్నారు. తొలిప్రేమ పాట సెకండ్ హాఫ్ లో ఉపయోగించడం అభిమానులకు బాగా నచ్చింది. ఎన్నో ఎలిమెంట్స్ ఉన్న ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాకి తమన్ తక్కువ సమయంలో అద్భుతమైన సంగీతం అందించారు. మా టీమ్ అందరి కృషి వల్లే ఇంత మంచి సినిమా చేయగలిగాము.” అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అమెరికా అనే తేడా లేకుండా అన్ని చోట్లా మొదటి షో నుంచే అద్భుతమైన స్పందన లభిస్తోంది. విమల్ థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి మేము సినిమా చూశాం. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. థియేటర్ దగ్గర పండగ వాతావరణం కనిపించింది. షో షోకి టాక్, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి ఈ స్థాయి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ఇంకా చూడనివాళ్ళు థియేటర్ కి వెళ్ళి చూడండి. ఇది పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో చూపించారు. హరీష్ శంకర్ గారు ఎంతో బాధ్యతగా గబ్బర్ సింగ్ ని మించేలా సినిమాని రూపొందించారు. ఈ సినిమాకు ఖచ్చితంగా లాంగ్ రన్ ఉంటుంది. భారీ వసూళ్లను సాధిస్తుంది.” అన్నారు.

నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది మా కల. అలాంటిది ఆయనతో సినిమా చేయడమే కాకుండా, ఇంత పెద్ద హిట్ అవ్వడం మాకు డబుల్ బొనాంజా. చాలా చాలా సంతోషంగా ఉంది. షో షోకి టాక్ పెరుగుతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అంటున్నారు. ఇది సెలెబ్రేట్ చేసుకునే సినిమా. పెద్ద హీరో నుంచి కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా వచ్చి చాలా కాలమైంది. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి.. షో షోకి వసూళ్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ విజయం పట్ల మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము. ఆదివారానికి దాదాపు అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అవుతుంది. కుటుంబమంతా థియేటర్ కి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా ఇది. మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమిది. మాకు ఈ చిత్రాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.” అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మాట్లాడుతూ.. “మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నవీన్ గారు, రవి గారు అరుదైన నిర్మాతలు. ఎక్కడా రాజీ పడకుండా ఉస్తాద్ ను నిర్మించారు. ఈ సినిమా కోసం ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేశాము. తక్కువ సమయంలో ఇంత మంచి సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. వేగంగా సినిమా చేసినా, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. భారీ సెట్లు రూపొందించడం జరిగింది. నవీన్ గారు, రవి గారు ఒకటే విషయం చెప్పారు. బడ్జెట్ ఎంతయినా పరవాలేదు, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడం మా కల, బాగా చేద్దాం అనేవారు. హరీష్ శంకర్ గారు అరుదైన దర్శకుడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం సమయం కేటాయించారు. రాత్రుళ్ళు కూడా చిత్రీకరణలో పాల్గొన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.” అన్నారు.

గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలోని పాటలో చరణంలో ఒక మాట రాశాను. మెత్తని మట్టిలో మొలిచిన మొలకవి కాదోయ్ నువ్వు, బండరాళ్లను బద్దలు కొట్టిన మొండి మొక్కవి నువ్వు. ఈ భావం ఈ సినిమా ఆరంభం నుంచి ఇప్పుడు ఈ విజయానందం వరకు జరిగిన ప్రయాణానికి సరిగ్గా సరిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ వంటి విజయవంతమైన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు హరీష్ శంకర్ గారికి, నిర్మాతలకు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.” అన్నారు.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్ తదితరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య సంగీతం: ఎస్. తమన్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్