Skip to content

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం – తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం ఆధ్వర్యంలో అనకాపల్లి, గాంధీనగర్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి అధ్యక్షతన ఈరోజు ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహావిష్కరణ సుప్రసిద్ధ సినీదర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేతుల మీదగా మరియు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కుటుంబ సభ్యుల మధ్య విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అనంతరం పెంటకోట కన్వెన్షన్ లో శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి అధ్యక్షతన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మహోత్సవ సభ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ రామకృష్ణ గారు మాట్లాడుతూ
రథసప్తమి రోజున అనకాపల్లి లో పుట్టి అనకాపల్లి లో పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక సాహిత్య వేత్తగా ఒక గేయ రచయితగా అనకాపల్లి కి గౌరవాన్ని తీసుకొచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పుట్టిన ప్రాంతంలో ఆయన తిరిగి న ప్రాంతంలో గాంధీనగర్ లో ఏర్పాటు చేయడం ఆ విగ్రహ ఆవిష్కరణకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అల్లుడు మంచి అభిమాని అయిన ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రావడం వారు చేతుల మీద పద్మశ్రీ అవార్డు గ్రహీత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహ ఆవిష్కరణ జరగడం గొప్ప విషయం అని, సిరివెన్నెల సీతారామశాస్త్రి కళాపీఠం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇవ్వాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, ఈ ఏడాది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి చేయడం జరిగిందని. విగ్రహ ఏర్పాటుకు తానా ప్రపంచ సాహిత్య వేదిక వారు సహకారం అందించారని అన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి కి వెళ్ళినా పుట్టిన ఊరు, పెరిగిన వీధిలో సిరి వెన్నెల విగ్రహ ఆవిష్కరణ అనేది యాదృచికం తో పాటు దైవ సంకల్పం అన్నారు. ప్రతి ఏటా సిరి వెన్నెల కళా పీఠం పేరిట అవార్డ్ ను సాహిత్య వేత్తలకు ఇస్తామన్నారు.

జీవంతో ఉన్నా లేకున్నా మనుషుల మనసుల్లో సజీవం గా నిలిచేది కొందరే అని ప్రముఖ సినీ దర్శకులు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాంటి వారిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒకరన్నారు. అనకాపల్లిలో తానా సాహిత్య విభాగం తానా సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం తో ప్రముఖ సినీ గీత రచయిత పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కాంస్య విగ్రహాన్ని నిర్వహించారు. గాంధీనగర్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అనంతరం పెంట కోట ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ అనకాపల్లి సిరి వెన్నెల వంటి వారి ఎందరికో పుట్టినిల్లు అన్నారు. మహనీయుల చరిత్ర తర్వాత తరాల వారికి తెలియాలన్న, స్పూర్తి పొందాలన్నా ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు అవసరమన్నారు. ఏ మనిషిని అయినా తన ఆలోచనలే ఉన్నత స్థితికి తీసుకెళ్తాయన్నారు. మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సాహిత్యాన్ని పరుగులు పెట్టించిన వ్యక్తి సిరి వెన్నెల అన్నారు. మానవీయ విలువలను ప్రతిబింబించేలా ఆయన పాటలు సాగాయన్నారు. సహజముగా దేశభక్తుడు అయిన ఆయన పాటల రూపములో దేశ భక్తిని చాటి చెప్పారన్నారు. కొణతాల సహకారంతోనే ఇది సాధ్యమన్నారు. తానా సభ్యులు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ 20 ఏళ్ల టెలిఫోన్ ఉద్యోగం వదిలేసి సినీ ఇండస్రీ లోకి అడుగుపెట్టడం సాహసమే అన్నారు. సిరి వెన్నెల చిత్రం తో తనకంటూ ప్రత్యేకత తో చరిత్ర సృష్టించారన్నారు. వరుసుగా మూడు సినిమాల్లో మూడు నంది అవార్డు లు అందుకున్నారన్నారు.
కార్యక్రమం లో సిరి వెన్నెల కుటుంబ సభ్యులు,బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కూటమి నేతలు పాల్గొన్నారు. కార్యక్రమం లో ఎలాంటి అవాంతరాలు లేకుండా జన సేన ఇంచార్జి రాంకీ ఆధ్వర్యములో ఏర్పాట్లు ను పర్యవేక్షించారు.

అనంతరం శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్
గారిని మరియు శాస్త్రి గారి కుటుంబ సభ్యులను సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని శాస్త్రి గారి కుటుంబాన్ని శ్రీశ్రీశ్రీ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారిని దర్శింప చేసి వేద పండితులచే ఆశీర్వచనం అందించి సత్కరించి అమ్మవారి జ్ఞాపకం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.