Skip to content

ఘనంగా తెలుగు సినిమా వేదిక ఉగాది పురస్కారాలు

23 చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా సత్కరించిన దత్తాత్రేయ మురళి మోహన్

తెలుగు సినిమా వేదిక ప్రతీ ఏడాది నిర్వహించే ఉగాది నంది పురస్కారాలు ఉగాది మరుసటి రోజు మార్చ్ 20న హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. హర్యానా మాజీ గవర్నర్, బి జే పి నేత  బండారు దత్తాత్రేయ, ఉప సభాపతి రామచంద్రులు నాయక్ , సీనియర్ నటులు మురళి మోహన్ , నటుడు పృద్వీరాజ్, హీరో ఆదిత్య ఓం,  ప్రముఖ దర్శకులు ఎస్ వి కృష్ణా రెడ్డి , దర్శకుల సంఘం అధ్యక్షులు వి ఎన్ ఆదిత్య, తెలుగు సినిమా నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, నిర్మాతలు కే .అచ్చిరెడ్డి, విజయ్ కుమార్ వర్మ, నటుడు రాంకీ , పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ , భద్రాచలం ఎమ్ ఎల్ ఏ  తెల్లం వెంకట్రావు, ఫిట్నెస్ గురు అనుప్రసాద్ లు హాజరైన ఈ వేడుకలో ఇటీవల గద్దర్ అవార్డు పొందిన 23 ఇరవైమూడు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా ఉగాది నంది పురస్కారంతో సత్కరించారు. ఇదే వేడుకలో కోర్ట్ , దండోరా, బందీ , ఆదిపర్వం, సీతా పయనం కృష్ణతో వంటి చిత్రాలలో ప్రతిభ కనబరిచిన ఆదిత్య ఓం , జెమినీ సురేష్, శుభోదయం సుబ్బారావు, సంజయ్ మేగోటి, రఘు, రోజా భారతిలతో పాటు సామాజిక రంగానికి చెందిన విజయ లక్ష్మి, చెరుకూరి ప్రసాద్ రాజు  నర్సింగ్ గౌడ్ లను ఉగాది నంది పురస్కారంతో సత్కరించారు. సోలో క్యారెక్టర్ తో  బందీ చిత్రంలో అద్బుత ప్రతిభను కనబరిచిన ఆదిత్య ఓం ని చిత్రపరిశ్రమ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సినీ కళలకు ప్రోత్సాహంగా నిలుస్తాయని, మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారి మనవడు 23 చిత్రంతో అరంగేట్రం చెయ్యడం సంతోషదాయకమని పేర్కొన్నారు.

హర్యానా మాజీ గవర్నర్, బి జే పి నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ – విజయ్ వర్మ నిర్వహించిన ఈ సినీ నంది పురస్కారాలను అందుకున్న విజేతలకు అభినందనలు. కళాకారులకు ఇలాంటి అవార్డులే కొండంత బలం, చిన్న సినిమాలను నిర్మించిన నిర్మాతలు చాల నష్టపోతున్నారు. స్టార్స్ లేకపోయినా మంచి కథాబలం వుండి, ప్రజల్ని చైతన్యవంతులు చేసే చిత్రాలు తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఎన్నో చిన్న చిత్రాలు నిరూపించాయి. ఇకముందు కూడా ఇలాంటి కార్యక్రమలు చేసి ఉత్తమ చిత్రాలకు నంది పురస్కార కార్యక్రమం నిర్వహిస్తారని బావిస్తున్నాను.

సీనియర్ నటులు మురళి మోహన్ మాట్లాడుతూ – విజయ్ వర్మ  పాకలపాటి తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్న చిత్రాలను ప్రోత్సహించడం అభినందనీయమని, 23 చిత్రంలో  హీరో హీరోయిన్  తేజ మరియు తన్మయి, సహ నటులు అందరూ  చాలా సహజంగా నటించారని, అలాగే దర్శకులు  రాజ్ రాచకొండ మరియు ఇతర సాంకేతిక నిపుణులు తమ ప్రతిభను కనబరిచారని అభినందించారు. సినీ రంగానికి విశేష సేవలు అందిస్తున్న జే వీ మోహన్ గౌడ్ కి సినీ సాఫల్యతా పురస్కారాన్ని అందజేశారు.  ఈ కార్యక్రమాన్ని మహోన్నతంగా నిర్వహించిన విజయ్ వర్మ ముఖ్య అతిధులు అభినందించారు.  మిమిక్రీ రమేష్ తన అభినయం తో సభికులను అలరించారు. విజయ మాధవి అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.