Skip to content

“తెలంగాణ సినీ ప్రస్థానం” పుస్తక పరిచయ సభ

డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన “తెలంగాణ సినీ ప్రస్థానం” పుస్తక పరిచయ సభ ఈ రోజు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ క ల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఐఏఎస్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు కె.వి. విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా, దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఆత్మీయ అతిథిగా, ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు, దర్శకులు అల్లాణి శ్రీధర్, సినీ పుస్తక రచయిత ఎస్ వీ రామారావు, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. “తెలంగాణ సినీ ప్రస్థానం” పుస్తకాన్ని ప్రముఖ రచయిత మామిడి హరికృష్ణకు అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో

పుస్తక రచయిత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ – మాది కరీంనగర్ జిల్లా. చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం, సినిమాల మీద ఆసక్తి ఉండేది. మా సొంత బుక్ స్టాల్ కోసం అనేక సినిమా పత్రికలు తీసుకునేవాళ్లం. ఆ పత్రికల్లో సినిమా వార్తలు చదువుతూ, వాటి పేపర్ కటింగ్స్ భద్రపరిచాను. అప్పుడే పైడి జయరాజ్ గురించి తెలుసుకున్నాను. నేను సేకరించిన సినీ సమాచారంతో 80 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానం పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకానికి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో నంది పురస్కారం దక్కింది. ఇప్పుడు తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తకాన్ని తీసుకురావడం సంతోషంగా ఉంది. నాకు సినిమా జర్నలిజంలో గురువులా భావించే మామిడి హరికృష్ణకు ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నా. తెలంగాణ ప్రాంత సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు గానీ పైడి జయరాజ్ , ఆయనకు ముందు నుంచే చాలామంది తెలంగాణ ప్రాంత నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిభ చాటారు. ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో కనీసం పది మంది తెలంగాణ వారు ఉండటం విశేషం. అన్నారు.

ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు కేవీ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ – తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తక రచనతో పొన్నం రవిచంద్ర గారు ఒక గొప్ప ప్రయత్నం చేశారు. అలాగే ఆ సినిమాలను తిరిగి మన ప్రేక్షకులు చూసేలా కూడా ఆయన ప్రయత్నం చేయాలని కోరుతున్నా. తెలంగాణలో ఎన్నో కళలు ఉన్నాయి. ఎంతోమంది గొప్ప కళాకారులు ఉన్నారు. వారి ప్రతిభ ప్రపంచానికి తెలిసేలా చేస్తే చాలా బాగుంటుంది. మన తెలుగు సాంస్కృతిక చరిత్రకు చిహ్నంగా మారిన రవీంద్ర భారతిలో కనీస సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అన్నారు.

ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – పొన్నం రవిచంద్ర గారు తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తక రచనతో ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ఈ పుస్తకాన్ని మామిడి హరికృష్ణ గారికి అంకితమివ్వడం ఎంతైనా సముచితం. సినిమా పరిశ్రమకు తెలంగాణ, ఏపీ అనే బేధం లేదు. ప్రతిభావంతులు ఎక్కడున్నా సినీ పరిశ్రమ ఆదరిస్తుంది, అక్కున చేర్చుకుంటుంది. అన్నారు.

ప్రముఖ రచయిత మామిడి హరికృష్ణ మాట్లాడుతూ – తెలంగాణ సినిమా గురించి ఎంతో సమాచారాన్ని పొన్నం రవిచంద్ర గారు ఈ పుస్తకం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఆయన నాకు ఈ పుస్తకాన్ని అంకితమివ్వడం గౌరవంగా భావిస్తున్నా. పొన్నం కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అన్నారు.

తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తకంలోని సమాచారం ఎంతో విలువైనదని, చాలా విషయాలు తెలుసుకునేలా చేసిందని దర్శకుడు వేణు ఊడుగుల, అల్లాణి శ్రీధర్, ఇతర అతిథులు ప్రశంసించారు.