Skip to content

‘వెంకట్రామయ్య గారి తాలూకా’ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ లాంచ్

సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్, సీనియర్ నటి సుధ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ‘జయమ్మ పంచాయతీ’ మూవీ ఫేమ్ దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా నటించారు. తండ్రి, పిల్లల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో వారి వారి బాధ్యతలను తెలియజేసేలా రూపొందిన ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే క్యూట్ లవ్‌స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండనుంది. ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు, రచయిత, నటుడు యనమదల కాశీవిశ్వనాథ్, మిర్చిమాధవి, జబర్దస్త్ ఫేం సత్యశ్రీ, మొగలిరేకులు సీరియల్ ఫేం ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు. టైటిల్ చాలా బాగుందని, సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ..‘‘ఈ చిత్రంలో వెంకట్రామయ్య గారు పాత్రను నేను పోషించా. నేను మనసు పెట్టి ఆత్మతో చేసిన సినిమా ఇది. ఇందులో చాలా గొప్ప థీమ్ ఉంది. అలాగే మంచి సందేశం ఉంది. తల్లిదండ్రుల ఆవేదన, పిల్లల బాధ్యతను చెప్పే సినిమా ఇది. గొప్ప కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది.’’ అని చెప్పారు.

సీనియర్ నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ..‘‘మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సురేష్ బాబుగారు లాంచ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా లక్కీ హ్యాండ్. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమా అన్ని వర్గాల వారు చూడదగ్గ చిత్రం. కుటుంబ సమేతంగా అందరూ చూడాలని కోరుతున్నా.’’ అన్నారు.

నిర్మాత కోమలి మాట్లాడుతూ..‘‘సింగర్ అయిన నేను ఈ సినిమాతో నిర్మాతగా మారాను. ఈ సినిమాలో నటించిన అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. మంచి కుటుంబ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీని ఉగాది సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరూ సపోర్ట్ చేసి మా సినిమాను ఆశీర్వదించండి’’ అన్నారు.

డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..‘‘సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా చూడదగ్గ సినిమా. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు లాంచి మంచి కంటెంట్ ఉన్న సినిమా. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా చూసి ఆదరించాలని కోరుతున్నా.’’ అన్నారు.

నటి మిర్చి మాధవి మాట్లాడుతూ..‘‘నా పాత్రను చాలా చక్కగా డిజైన్ చేశారు. హీరో తల్లిగా నా పాత్ర చుట్టూ స్టోరీ చాలా మలుపులు తిరుగుతుంది. పల్లెటూరి నేపథ్యంలో జరిగే క్యూట్ లవ్‌స్టోరీ. అన్ని రకాల ఎమోషన్స్‌తో అందరినీ మెప్పించేలా ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ తీర్చిదిద్దారు. అందరూ తప్పకుండా చూడండి.’’ అన్నారు.

నటి సత్యశ్రీ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాలో నేను ఫ్రెండ్ రోల్‌ చేశాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటి దాకా నన్ను కామెడీ పాత్రల్లో చూశారు. ఇందులో నటనకు ఆస్కారమున్న ఎమోషనల్ క్యారెక్టర్‌లో చూస్తారు. సినిమాలో నా పాత్ర చూసి థ్రిల్ ఫీలవుతారు. నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చిన డైరెక్టర్‌కు థ్యాంక్యూ.’’ అని అన్నారు.

తారాగణం: మురళీధర్ గౌడ్, సుధ, దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని యామిని తదితరులు

సాంకేతిక బృందం:
బ్యానర్: కోమలి క్రియేషన్స్
నిర్మాతలు: కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: సతీష్ ఆవాల
కొరియోగ్రాఫర్: సాగర్ మాస్టర్
మ్యూజిక్ డైరెక్టర్: చరణ్ అర్జున్
కెమెరామెన్: బి. అనిల్ కుమార్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్.