దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా…
సిరివెన్నెల గారు ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్నారు- కె. నాగబాబు

– ఎదుటివారికి సహాయం చేయడమే కానీ, ఇతరులను సహాయం అడగడం ఆయనకు తెలియదు
– ఆయన మా తెలుగువాడని, ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకొనేంత గొప్ప మహనీయులు
– ‘సిరివెన్నెల స్మృతివనం’ శంకుస్థాపన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు
ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్న మహనీయులు, ఆయన మా తెలుగువాడని, ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకునేంత గొప్ప కవి శ్రీ చెంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి గారు అని రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. అనకాపల్లి నియోజకవర్గం గాంధీనగర్లో రూ.39.70 లక్షల జీ.వీ.ఎం.సీ. నిధులతో, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ‘సిరివెన్నెల స్మృతివనం’కు శాసనమండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి 71వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిసినప్పుడల్లా అన్నయ్య అని పిలిచేవాడినని, ఆయన కూడా అదే ఆప్యాయతతో తమ్ముడు.. అని పిలిచేవారని, ఆయన పుట్టిన ప్రాంతానికి వచ్చి, చిన్ననాటినుండి ఆయన నడయాడిన ప్రదేశంలో నా చేతులమీదుగా స్మృతివనం శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉన్నదని, “నాగబాబు వచ్చి నా స్మృతివనం శంకుస్థాపన చేయి..” అని శాస్త్రిగారు పిలిచినట్టు అనిపించిందని బాధాతప్త హృదయంతో స్మరించుకున్నారు.
రుద్రవీణ చిత్రం నిర్మాణ దశలో బాలచందర్ గారు – శాస్త్రి గారిని పిలిపించి మాట్లాడారని, రుద్రవీణ చిత్రంలోని పాటలు అన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారని గుర్తు చేసుకున్నారు. శ్రీశ్రీ గారు రాసిన “నేను సైతం..” అనే ఒక లైన్ తీసుకొని గొప్పపాటను రాసిన గొప్పరచయిత అని కొనియాడారు. “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమిని…” అనే గొప్పపాట నాతోపాటుగా, అనేకమందికి స్పూర్తిగా నిలుస్తుందని, ఎదుటివారికి సహాయం చేయడమే కానీ ఇతరులను సహాయం అడగడం ఆయనకు తెలియదని అన్నారు. ముస్లిం మతానికి చెందిన ఒక బాలుడిని చదివించి, అతన్ని ప్రయోజకుణ్ణి చేసిన విధానం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కులాలకు, మతాలకు అతీతంగా బ్రతికేవారు అని చెప్పడానికి నిదర్శనం. ఆయన సంపాదించుకున్నదంతా బంధువులకు, సన్నిహితులకు, ప్రజలకు గుప్తదానాలుగా అందజేసి, ఎంతోమంది పేదవిద్యార్థులను చదివించారని చెప్పారు. ఆయన రాసిన పాటలన్ని ఆణిముత్యాలుగా నిలిచాయని, అలాంటి మహానుభావుని స్మరించుకోవడం ఆనందంగా ఉన్నదని అన్నారు. అన్నయ్య చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వరుణ్ బాబును సొంత మనుషులుగా ప్రేమించేవారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడల్లా “మీరు పుట్టిందే ప్రజల కోసం, ప్రజలు మీకు పట్టం కట్టే రోజు ఒకటి వస్తుందని..” అనేవారు, ఈ రోజు ఆయన బతికి ఉంటే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలా సంతోషించే వారని అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పేరు మీద స్మృతివనం నిర్మిస్తున్న, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారికి, ఇతర నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ భాస్కర భట్ల రవికుమార్ గారికి సిరివెన్నెల స్మారక పురస్కారం ప్రధానం చేయడం ఆనందంగా ఉన్నదని, శ్రీ భాస్కర భట్ల రవికుమార్ గారికి అభినందనలు తెలిపారు.
మాజీమంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మన అనకాపల్లి ప్రాంతానికి చెందినవారని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నదని, ఆయన పేరుమీద భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.


