Skip to content

‘తు యా మైన్’ చిత్రంపై దర్శకుడు మణిరత్నం ప్రశంసల జల్లు

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం ‘తు యా మైన్’ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి విశేష స్పందనను రాబడుతోంది. శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, తనదైన ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తాజాగా దక్షిణాదిలో నిర్వహించిన ఓ ప్రత్యేక స్క్రీనింగ్ లో భారతీయ చలనచిత్ర దిగ్గజం మణిరత్నం ఈ చిత్రాన్ని వీక్షించి, చిత్రబృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. “బిజోయ్ నంబియార్ ఈ చిత్రంలో ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకువచ్చారు. ఇది థియేటర్లలో, ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం,” అని ప్రశంసించారు.

ప్రత్యేక ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు కూడా సినిమాపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు దీన్ని “అద్భుతమైన సినిమా”గా అభివర్ణించగా, మరికొందరు ఇందులోని ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్టోరీటెల్లింగ్ కొత్త అనుభూతిని ఇచ్చాయని పేర్కొన్నారు. మణిరత్నం వంటి లెజెండరీ డైరెక్టర్ నుంచి ప్రశంసలు లభించడం సినిమా విజయాన్ని మరింత బలపరిచింది.

కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ పతాకంపై ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ మరియు భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ పక్షాన వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. యువతను లక్ష్యంగా చేసుకుని, మునుపెన్నడూ చూడని ఎమోషన్స్ మరియు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ‘తు యా మైన్’ ప్రస్తుతం మీ దగ్గర్లోని సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.