గత కొన్ని రోజులగా డాన్సర్ అసోసియేషన్ వివాదం గురించి వింటూనే ఉన్నాము. కాగా నేడు ఈ…
మెదక్ జిల్లాలో పర్యటించిన నటుడు విష్ణు మంచు

మెదక్, తెలంగాణ: ప్రముఖ నటుడు విష్ణు మంచు, మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ గారి ఆహ్వానం మేరకు మెదక్ జిల్లాలో ఒకరోజు పర్యటించారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆయన, జిల్లాలోని పలు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి వాటి విశిష్టతను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విష్ణు మంచు చారిత్రక ప్రాధాన్యం కలిగిన మెదక్ కోట, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గాభవాని ఆలయం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ కేథడ్రల్లను సందర్శించారు. అక్కడి చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అధికారులతో పలు అంశాలపై చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు మంచు, మెదక్ జిల్లాకు అపారమైన పర్యాటక, సినీ చిత్రీకరణ అవకాశాలు ఉన్నాయని అన్నారు. “మెదక్లోని కోటలు, అడవులు, సరస్సులు, దేవాలయాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు సినిమాల చిత్రీకరణకు అత్యంత అనువైన ప్రదేశాలు. భవిష్యత్తులో నా సినిమాల చిత్రీకరణను ఇక్కడ నిర్వహించేందుకు తప్పకుండా ప్రణాళికలు రూపొందిస్తాను” అని తెలిపారు.
మెదక్ వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు, ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక పటంలో ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు చేపట్టే కార్యక్రమాలకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని విష్ణు మంచు హామీ ఇచ్చారు.
అంతేకాకుండా ప్రజలను ఉద్దేశించి, “ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఒక్కసారైనా మెదక్ను సందర్శించండి. ఇక్కడి చరిత్రను తెలుసుకోండి… ప్రకృతి అందాలను ఆస్వాదించండి… మన గొప్ప వారసత్వాన్ని అనుభవించండి” అంటూ పిలుపునిచ్చారు.
మెదక్ను తెలంగాణలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ గారు, జిల్లా పర్యాటక శాఖ అధికారులు చేస్తున్న కృషిని విష్ణు మంచు ప్రత్యేకంగా అభినందించారు.

