Skip to content

ఉచిత విద్యా ప్రాజెక్ట్‌కు సిద్ధమైన చిరంజీవి

ఉచిత విద్యా ప్రాజెక్ట్‌కు సిద్ధమైన చిరంజీవి Telugu News

వెండితెర రారాజుగా కోట్లాది అభిమానులు, ప్రేక్షకులని అలరించే మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ, తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంస్థలు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తూ, అనేక సంక్షోభ సమయాల్లో ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచాయి. ఏదైనా ప్రకృతి విపత్తు, అనుకోని అత్యవసర పరిస్థితి అయినా, సహాయం అందించడానికి ముందుకు వచ్చే వారిలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు.

ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి ఒక ముఖ్యమైన కొత్త కార్యక్రమం గురించి చెప్పారు. “రక్తం యొక్క ప్రాముఖ్యతను, రక్త కొరత కారణంగా ఎన్ని ప్రాణాలు పోతున్నాయో నేను అర్థం చేసుకున్నప్పుడు, నా అభిమానులందరినీ రక్తదానంలో పాల్గొనేలా స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. ఆ ఆలోచన నాకు 25 ఏళ్ల క్రితమే కలిగింది”

”నేను కేవలం అక్కడితోనే ఆగిపోదలచుకోలేదు. భవిష్యత్తులో పేద ప్రజలకు విద్యను ఎలా అందించాలనే దానిపై ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నన్ను స్ఫూర్తిగా తీసుకుని నటుడు సూర్య ‘అగరం ఫౌండేషన్’ను ప్రారంభించారు. ఇప్పుడు, నేను ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఉచిత విద్యా బోధనను ప్రారంభించాలనుకుంటున్నాను. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడైతే అవసరం ఉంటుందో, అక్కడ ఉచిత విద్యను అందించే దిశగా కృషి చేస్తాను”

ఈ కొత్త విద్యా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. సమాజానికి ఉపయోగపడే మరో గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.