Skip to content

‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

అన్నదాన కార్యక్రమంతో మొదలైన ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనుంది : ట్రస్టీ చైర్మన్ నందమూరి మోహనకృష్ణ గారు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సతీమణి శ్రీమతి నందమూరి బసవతారకం గారి శతజయంతి సందర్భంగా నేడు ఆ కుటుంబ సభ్యులు ఆమె పేరుతో ‘నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆమె జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను నందమూరి కుటుంబ సభ్యులు వహిస్తూ చైర్మన్ గా నందమూరి మోహనకృష్ణ గారు, మేనేజింగ్ ట్రస్టీగా నందమూరి మోహన రూపా గారు, ట్రస్టీలుగా నందమూరి సీమంతిని గారు, తుమ్మల ప్రసన్నకుమార్ గారు బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నందమూరి మోహన కృష్ణ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. మా అమ్మ గారి శత జయంతి సందర్భంగా నేడు ఆమె పేరిట ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో అలాగే ప్రజలకు సేవ చేసే రాజకీయ రంగంలో ఎన్నో చూశారు. అటువంటి నాన్నగారి ప్రయాణాలలో అండగా నిలిచి తనదైన బాధ్యతగా మా అందరిని పెంచి పోషిస్తూ తీర్చిదిద్దారు. ఆమె రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. గ్రాండ్ మా హోమ్ లో మహిళ వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం, అలాగే అన్నదాన కార్యక్రమంతో ప్రారంభమైన ఈ సేవ ముందు ముందు అంచలంచలుగా పేదవారికి అన్ని రకాలుగా అండగా నిలబడుతూ వైద్యం అలాగే ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ మేమే తెలుసుకొని అవసరం ఉన్నవారికి అన్ని విధాలుగా అండగా నిలబడాలని మరిన్ని సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. ఆ పుణ్య దంపతులు ఆశీర్వాదాలు మా కుటుంబ సభ్యులకు అలాగే తెలుగు వారందరికీ ఎప్పుడు ఉంటాయి” అన్నారు.

నందమూరి మోహన రూపా గారు మాట్లాడుతూ… “మీడియా మిత్రులందరికి నమస్కారం. నేడు పుణ్య దంపతులు నందమూరి తారక రామారావు గారు, బసవతారకం గారిని గుర్తు చేసుకుంటూ ఆమె శత జయంతి సందర్భంగా నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. తాతగారు ప్రజాసేవలో అలాగే తన బాధ్యత అయిన వంటి నటన రంగంలో బిజీగా ఉన్నప్పటికీ నానమ్మ గారు తనదైన బాధ్యతగా తన సంతాన బాధ్యతలను తీసుకుని తన పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దారు. ఆ పుణ్య దంపతులు ఎప్పటికీ మా మనసులో కొలువై ఉంటారు. తాత గారికి ప్రతి విషయంలో అండగా నిలిచి ఆయన ప్రతి అడుగులో వెంట నడుస్తూ సపోర్ట్ చేసిన మా నానమ్మ గారిని గౌరవించుకుంటూ ఈ ట్రస్టు ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయనున్నాము. పేదవారికి అండగా నిలుస్తూ విద్యారంగంలో స్కాలర్షిప్లు ఇవ్వడం లాంటి పనులు చేయనున్నాము. ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారికి త్వరగా నయం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాలకు ప్రజలందరికీ సపోర్టు కావాలని కోరుకుంటున్నాము. జై ఎన్టీఆర్” అన్నారు.

నందమూరి సీమంతిని గారు మాట్లాడుతూ… “నేడు బసవతారకం గారి శతజయంతి సందర్భంగా ట్రస్ట్ ప్రారంభించి అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. ఆ పుణ్య దంపతుల ఆశీస్సులు ఎప్పటికీ మన అందరికీ ఉంటాయి” అన్నారు.

తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ… “నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి బసవతారకం గారి శత జయంతి సందర్భంగా ఆమె పేరిట నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం ఆనందకరం. రామారావు గారు తన బాధ్యతలకు ఎంతో బిజీగా ఉన్న సమయంలో ఆమె తన సంతానం అందరిని పెంచి పెద్ద చేసి జీవితంలో క్రమశిక్షణ నేర్పుతూ ఉన్నత స్థాయికి చేరడంలో ఎంతో కృషిచేసి ఆ కుటుంబానికి, రామారావు గారికి అండగా నిలిచారు. రామారావు గారు తన విధినిర్వహణలవల్ల తన సొంత కుమారుడి పెళ్లికి రాలేకపోయినప్పటికీ ఆమె ఒంటరిగానే పెళ్లి బాధ్యతలు కూడా తన భుజంపై వేసుకుని పెళ్లి చేశారు. రామారావు గారు బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడి రాజకీయంగా కూడా ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లారు. ఈ ట్రస్ట్ ద్వారా ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయనున్నాము” అంటూ ముగించారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.