Skip to content

థియేటర్ల మనుగడ కోసం ప్రభుత్వంతో చర్చలు: APFDC చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్రప్రదేశ్ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్‌కు విజయవాడలో ఎగ్జిబిటర్లు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం రాష్ట్రంలోని థియేటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై భరత్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫైర్, సినిమాటోగ్రఫీ తదితర శాఖల లైసెన్సుల గడువులు వేర్వేరుగా ఉండటంతో ఎగ్జిబిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని శాఖలకు ఒకే విధంగా 5 ఏళ్ల కాలపరిమితితో సింగిల్ విండో విధానంలో లైసెన్స్ రెన్యూవల్స్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.

ఎగ్జిబిటర్ల సమస్యలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడామని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉందని భరత్ భూషణ్ తెలిపారు. ఎఫ్‌డీసీలో ఎగ్జిబిటర్లు మెంబర్‌షిప్ తీసుకోవాలని సూచించారు. ఎగ్జిబిటర్లందరూ కలిసి ఉంటే తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం మరింత సులభమవుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,197 మంది ఎగ్జిబిటర్లను గుర్తించామని, ప్రతి ఎగ్జిబిటర్ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని భరత్ భూషణ్ పేర్కొన్నారు. కేవలం టికెట్ ధరలు పెంచడం ఒక్కటే పరిష్కారం కాదని, థియేటర్ల నిర్వహణ, వ్యాపారం సజావుగా కొనసాగేందుకు అవసరమైన పరిస్థితులను కల్పించడం కూడా ముఖ్యమని చెప్పారు.

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2,000కు పైగా థియేటర్లు ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 1,200కు పడిపోయిందని భరత్ భూషణ్ తెలిపారు. ముఖ్యంగా గత 3–4 నెలల్లోనే సుమారు 400 థియేటర్లు మూతపడ్డాయని చెప్పారు. టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే వెంటనే శాశ్వత జీవో వస్తుందని ఎవరూ ఆశించవద్దని ఆయన అన్నారు. ఎగ్జిబిటర్లకు టికెట్ ధరలు పెంచే అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. టికెట్ రేట్ల పెంపు విషయంలో అత్యాశకు పోకుండా మార్కెట్ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

టూరిజం, హోటల్ రంగాలకు వర్తింపజేస్తున్న విధంగానే సినిమా రంగానికి, థియేటర్లకు కూడా ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని భరత్ భూషణ్ అన్నారు. పెరుగుతున్న ఉద్యోగుల జీతాలు, విద్యుత్ ఛార్జీలు, థియేటర్ల ఆధునీకరణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని నిర్వహణ ఛార్జీలను కొంత మేర పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనే తేడా లేకుండా అన్ని కేటగిరీల థియేటర్లకు ప్రజలకు అందుబాటులో ఉండేలా యూనిఫామ్ టికెట్ ధరలను సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. థియేటర్ల సమస్యల పరిష్కారానికి ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.